Saturday, February 9, 2013

గర్భస్థ శిశువు మన మాటలను వింటుందట..!

గర్భిణీ స్త్రీలను వీలైనంత ప్రశాంతంగా ఉండమని చెబుతుంటారు. ఎంత మంచి మాటలు వింటే అంత మంచిదని, ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటే శిశువు అంత ఆరోగ్యంగా పుట్టి పెరుగుతుందని సూచిస్తుంటారు. అంతేకాదు.. గర్భస్థ శిశువు మన మాటలను వింటుంది.

నేర్చుకోవడం అనేది గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ప్రారంభమౌతుందని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. ఇదే విషయాన్ని ఆధ్యాత్మిక పరంగా పురాణాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

అభిమన్యుడు పెరిగి పెద్దయ్యాక పద్మవ్యూహం గురించి నేర్చుకోలేదని, తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు.

అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు. అయితే, పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. కనుకనే తర్వాతి కాలంలో అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే రాక్షస రాజు హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భంలో ఉండగా నారదుడి మాటలు విని ఆకళింపు చేసుకున్నాడు. అందువల్లనే పుడుతూనే విష్ణుభక్తుడు అయ్యాడని చెప్తారు. నారదుడు లీలావతికి చేసిన ఉపదేశం ఆమె కంటే కూడా ఆమె గర్భంలో పెరుగుతున్న ప్రహ్లాడునికే ఎక్కువ ఉపయోగపడిందని పురాణాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment