Sunday, April 19, 2015

వధూవరులకు బాసికం ఎందుకు కడుతారో తెలుసా..?

హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం... మన హిందువులు పురాతనకాలంలో నిర్వహించుకున్న కొన్ని పద్ధతులు ఆచారంగా మారిపోయాయి. అయితే వాటి వెనుక కొన్ని కారణాలు, శాస్రీయపరమైన ఫలితాలు కూడా వుండేవి. ముఖ్యంగా ప్రాచీనులు నిర్వహించుకునే ప్రతిఒక్క పనిని కూడా ముందుగా దేవుణ్ణి ఆరాధించుకుని పూర్తి చేసుకునేవారు. దాంతో వారి పనులన్నీ సక్రమంగా జరుగుతాయని, ఇతరుల వల్ల వచ్చే దుష్ర్పభావాలు వాటిమీద ప్రభావం చూపవని బలంగా నమ్మేవారు. ప్రస్తుతకాలంలో వున్న శాస్త్రజ్ఞులు కూడా ఆ పద్ధతులు నిర్వర్తించడం వల్ల ప్రయోజనాలు జరుగుతాయని తమ శాస్త్రీయ విధానాల ద్వారా కూడా నిరూపించారు.

అందులో భాగంగానే హిందూ వివాహ పద్ధతిలో వధూవరులకు నుదుటన బాసికం కడతారు. ఇలా కట్టడం వెనుక శాస్త్రీయపరంగా, హిందూ ధర్మం - ఆచారాల పరంగా అనేక లాభాలు వున్నాయి. మానవ శరీరంలో మొత్తం 72వేల నాడులు వుంటాయి. అందులో 14 నాడులు ఎంతో ముఖ్యమైనవి. వీటివల్ల మానవ శరీరంలో ఎల్లప్పుడూ ఉత్తేజ పరిస్థితిలో వుంటుంది. అయితే ఈ 14 నాడుల్లో ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు నాడులు చాలా ముఖ్యమైనవి. వీటిలో సుషుమ్న అనే నాడికి కుడివైపున సూర్యనాడి... ఎడమవైపు చంద్రనాడులు వుంటాయి. ఈ రెండు నాడులు కలిసే ప్రాంతం ముఖంలోని నుదుట మధ్య భాగం.

ఈ రెండు నాడుల కలయిక అర్థచంద్రాకారంలో వుంటుంది. పురాతనకాలంలో వుండే ఋషులు ఈ ఆకారాన్ని దివ్యచక్షవు అనే పిలిచేవారు. దీనిపై ఇతరుల దృష్టి పడి దోషం కలగకుండా వుండేందుకు వధూవరుల నుదుటన బాసికం కడతారు. అలాగే అటువంటి సమయాల్లో ఎటువంటి ప్రమాదాలు, కష్టాలు రాకుండా వుంటాయని ప్రజల విశ్వాసం. బాసికం అర్థచంద్రాకారంలోగానీ, త్రిభుజాకారంలోగానీ వుంటుంది. కాబట్టి నుదుటన బాసికం కట్టడం ఎంతో ఆవశ్యకం.

నుదుటభాగంలో సాక్షాత్తూ బ్రహ్మదేవుడు కొలువై వుంటాడని మనందరికీ తెలిసిందే! అటువంటి భ్రూమధ్య స్థానంలో కొలువై వున్న బ్రహ్ముడు మానవుని భవిష్యవాణికి సంబంధించిన అన్ని విషయాలను ఈ స్థానంలోనే పొందుపరుస్తాడు. మన పెద్దలు కూడా ఇటువంటి విషయాల గురించి అప్పడప్పుడు చెబుతూ వుంటారు. నుదుటన చేతులు పెట్టుకోవడం అరిష్టమని, ఎప్పుడుపడితే అప్పుడు నుదుటభాగాన్ని చేతితో రాసుకోకూడదని చెబుతుంటారు. కాబట్టి అటువంటి చోట ఇతరుల దృష్టి పడటం అంత మంచిది కాదని పూర్వకాలపు ఋషులు కూడా పేర్కొన్నారు. అందువల్లే ఈ బాసికాధారణ ఆచారం పురాతన కాలం నుంచి వ్యాప్తిస్తూ వస్తోంది.

ముఖ్యంగా ఇది పెళ్లి సంబంధాలలో ఎందుకు ధరిస్తారంటే.. సాధారణంగా పెళ్లి జరిగే సమయాల్లో వధూవరులను అందంగా అలంకరిస్తారు. వారిని చూసిన ప్రతిఒక్కరు కూడా వారివైపు ముగ్ధులయిపోతారు. అలా అందరూ చూసిన వేళ దోషాలు వున్న వ్యక్తుల కళ్లు కూడా వాళ్లమీద పడిపోతాయి. అటువంటి వారి నుంచి రక్షణ పొందడానికి బ్రహ్మదేవుడు కొలువై వున్న ఈ నుదుట భ్రూమధ్య భాగంలో ఈ బాసికాన్ని ధరిస్తారు. దాంతో వధూవరుల మధ్య పరస్పర సంబంధాలు కూడా బలపడుతాయి.

No comments:

Post a Comment