Sunday, April 19, 2015

అరటి ప్రాముఖ్యతేంటో మీకు తెలుసా..?

‘అరటి’’ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... ప్రాచీనకాలం నుండి ప్రస్తుతవరకు మన భారతీయ సంస్కృతిలో ఏ శుభకార్యం జరిగినా.. అందులో అరటాకుగాని, అరటిపళ్లుగాని, అరటిచెట్టుకు సంబంధించిన కాండాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.

ఈ అరటి ప్రాముఖ్యత గురించి రామాయణంలో వివరించబడితే.. ఇదే అరటి ఆవిర్భావం గురించి భాగవతంలో వివరించబడింది. అరిటిని ‘కదళి’, ‘రంభా’ అనే పేర్లతో కూడా చాలామంది పిలుచుకుంటారు. ముఖ్యంగా ఇవి పల్లెటూళ్లలో జరిగే ప్రతిఒక్క కార్యక్రమంలోను ఉపయోగించుకుంటారు.

దేవుళ్లకు సంబంధించిన పూజా కార్యక్రమాలలోను.. ముఖ్యంగా స్త్రీలు వ్రతాలు, నోములు నోచుకున్నప్పుడు తమ ఇష్టదేవతలకు పూజలు నిర్వహించుకునేటప్పుడు ఈ అరటి ఆకులను, పళ్లను ఉపయోగిస్తారు. ముత్తైదువులకు భోజనం పెట్టేటప్పుడు అరటి ఆకులను, దానం చేస్తున్నప్పుడు అరటిపళ్లను ఇస్తారు.

అదేవిధంగా కొత్తగా ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు ఇంటి గుమ్మాలకు వీటిని తగిలిస్తారు. అలాగే పెళ్లి వంటి కార్యక్రమాలలో కూడా ఈ అరటి తనదైన ప్రాధాన్యతను కలిగి వుంటుంది.

అరటి ఆవిర్భావం :

సృష్టి ఆవిర్భవించిన మొదట్లో విరాట్ స్వరూపునితోపాటు లక్ష్మీ, దుర్గ, వాణి, సావిత్రి అనే పంచ శక్తులు కూడా పుట్టాయి. ఈ ఐదుగురిలోనూ రాధ, సావిత్రులు సమానంగా సౌందర్యాన్ని కలిగివుంటారు.

అయితే సావిత్రి తన అందాన్ని చూసుకొని గర్వించుకోవడం మొదలుపెట్టింది. దాంతో విరాట్ మూర్తి ఆమెను ‘‘బీజం లేని చెట్టు’’గా భూలోకంలో జన్మించమని శపిస్తాడు.

సావిత్రి తన తప్పును తెలుసుకుని ఎంత వేడుకున్నా.. చివరకు విధిలేక భూలోకంలో కదళీ అనే అరటిచెట్టుగా జన్మించింది. ఆమె తన శాపం నుంచి విముక్తి పొందడానికి ఐదువేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసింది.

కదళీ తపస్సు చూసి మెచ్చిన విరాట్ ఆమె ముందు ప్రత్యక్షమై పుణ్యలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా... అంశరూపమైన కదళిని మానవ, మాధవసేవ చేయడానికి భూలోకంలోనే వుండమని ఆదేశించాడు.

అలా ఆ విధంగా విరాట్ మూర్తి ఆదేశం పొందిన ఆ పర్వదినాన్ని మాఘకృష్ణ చతుర్దశిగా పేర్కొంటారు. దీనినే అరటి చతుర్దశి అని అంటారు.

అరటి ప్రాముఖ్యత :

అరటి ప్రాముఖ్యతను, పూజా కార్యక్రమాలలో దాని స్థానం గురించి భరద్వాజ మహర్షి సీతారాములకు చెప్పినట్లు రామాయణంలో పేర్కొనబడింది.

మార్ఘచతుర్దశినాడు ఉదయాన్నే లేచి అభ్యంగన (అభిషేక) స్నానం చేసి, పెరటిలోవున్న అరటినిగానీ, అరటిపిలకనుగాని పూజ చేసుకోవాలి. పసుపుకుంకుమలతో, పుష్పాలతో చక్కగా అరటికాండాన్ని అలంకరించి, దీపారాధన చేసుకోవాలి. దూపానంతరం పెసరపప్పు బెల్లం, 14 తులసీ దళాలు (నాలుగు ఆకులు ఉండాలి) నైవేద్యంగా సమర్పించాలి.

మధ్యాహ్న సమయంలో ఐదుగురు ముత్తైదువులను పిలిచి.. వారికి భోజనం పెట్టి, అరటిదవ్వ లేదా ఐదు అరటిపళ్లను దానం చేయాలి. అయితే ఈ పూజను చేసేవారు మధ్యాహ్నం భోజనం చేయకూడదు. సాయంత్రం చంద్రదర్శనం అయిన తరువాత భోజనం చేసుకోవాలి.

ఈ విధంగా అరటిపూజలను నిర్వహించుకున్నవారికి చక్కని సంతానం కలగడమే కాకుండా... ఆ సంతానానికి ఉన్నత కలుగుతుంది. పిల్లాపాపలతో వారు సంతోషంతో జీవనాన్ని కొనసాగిస్తారు.


రామాయణ కథ :

రామాయణంలో రావణుడిని రాముడు వధించిన తరువాత.. శ్రీరాముడు సీతసమేతంగా భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకుని అక్కడ విడిది చేశారు. తరువాత శ్రీరాముడు భరతుని రాక గురించి తెలియజేమని మారుతిని కోరుతాడు. హనుమంతుడు ఆ వార్తను భరతునికి చెప్పి, తిరిగి ఆశ్రమానికి చేరుకుంటాడు.

ఆ సమయంలో శ్రీరామునితో సహా అందరూ భోజన కార్యక్రమంలో కూర్చుంటారు. అయితే మారుతికి మాత్రం ఆకు కరువవుతుంది. అప్పుడు రాముడు హనుమంతుడి గొప్పతనాన్ని తెలియజేయడానికి... తన కుడివైపున మారుతిని కూర్చోమని చెబుతాడు.

భరద్వాజ మహర్షీ కూడా ఏమీ చేయలేక చివరికి ఆ అరటి ఆకులోనే హనుమంతుడికి భోజనాన్ని వడ్డిస్తాడు. భోజనం ముగిసిన తర్వాత అందరి సందేహాలను శ్రీరాముడు దూరం చేస్తూ.. ఈ విధంగా అంటాడు... ‘‘శ్రీరాముని పూజలోగాని, మారుతిపూజలోని గానీ ఎవరైతే మాకు అరటిఆకులో అరటిపండ్లను అర్పిస్తారో, వారికి మా ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి అంతేకాకుండా, జ్యేష్ఠమాసం శుక్ల తదియనాడు ఎవరైతే పైవిధంగా ఇద్దరికీ సేవ చేస్తారో, వారి తరతరాలకు సంతానలేమి ఉండదు. గృహస్థులు అతిథిసేవల్లో అరటి ఆకును వినియోగించితే వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి’’.

No comments:

Post a Comment