Tuesday, August 14, 2012

వంటల తయారికి చిట్కాలు


  • అన్నం, పప్పు వండేటప్పుడు సరిగ్గా అవసరమైనంతవరకే నీటిని పోయండి.
  • అర్జెంటుగా మీకు మజ్జిగ కావలసి వచ్చిందనుకోండి-దానికేం చేస్తారంటే-పాలు గోరు వెచ్చగా వెచ్చబెట్టి అందులో చిటికెడు ఉప్పు వేయండి. కొద్దిగా నిమ్మ పండు రసం కూడా పిండండి. కొద్ది సేపట్లోనే పాలు విరిగి మజ్జిగ అవుతుంది.
  • అల్యూమినియం లేదా ఇనుప పెనం మీద దోసెలు వేస్తున్నప్పుడు అవి సరిగ్గా రాకుండా అంటుకుపోతుంటే పెనం సరిగ్గా వేడెక్కలేదేమో గమనించండి. సరిగ్గా వేడెక్కకపోతే దోసెలు దానికి అంటుకుపోతాయి.
  • ఆలూ చిప్స్ ఇంట్లో చేసేటప్పుడు నల్లబడి పోకుండా ఉండాలంటే పలచని మస్లిన్ వస్త్రంలో కాస్త సిట్రిక్ యాసిడ్ వేసి దాని ముక్కల్ని ఉడికించే నీటిలో ముంచి తీయాలి.
  • ఇడ్లీ పిండి పల్చగా ఉంటే కొద్దిగా బొంబాయి రవ్వ కలపాలి.
  • ఇడ్లీ పిండి రుబ్బే సమయంలో గుప్పెడు అటుకులుకానీ, గుప్పెడు అన్నం కానీ వేశారంటే ఇడ్లీలు చాల మృదువుగా ఉంటాయి.
  • ఇడ్లీ పిండిని టైటుగా మూత పెట్టిన ప్రెజర్ కుక్కర్లో ఉంచారంటే త్వరగా పులుస్తుంది. ఇడ్లీ చప్పగా కాకుండ రుచిగా ఉంటాయి.
  • ఇడ్లీ పిండిలో చెంచా నువ్వుల నూనె వేస్తే ఇడ్లీలు తెల్లగా మృదువుగా వస్తాయి.
  • ఉడికించే నీటిలో కొద్దిగా వంటనూనె వేస్తే బంగాళదుంపలు త్వరగా ఉడుకుతాయి.
  • ఉల్లి పాయను అడ్డంగా కోసి దోసెల (అట్లు) పెనం మీద రాస్తే దోసెలు చక్కగా చెడకుండా వస్తాయి.


  • ఊరగాయ పాతబడి ఎండిపోతే అరస్పూను చెరుకురసం కలిపి చూడండి.
  • కంది పప్పు ఉడకాలంటే, ఉడుకుతున్నప్పుడు నాలుగైదు బియ్యపు గింజలు వేస్తే చాలు. అలాగే కంది పప్పు ఉడుకుతున్నప్పుడు పొంగితే, రెండు నూనె బొట్లు వేస్తే పొంగు తగ్గి పోతుంది.
  • కేక్ తయారు చేసే సమయంలో పిండికి చిటికెడు సాల్ట్ కలిపితే కేక్ చాలా రుచిగా ఉంటుంది.
  • కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయండి. చేదు తగ్గడమే కాదు, కూరకు కొత్త రుచి వస్తుంది.
  • కాఫీ మరీ చేదుగా అనిపిస్తే కాస్త ఉప్పు కలపండి, తాగడానికి రుచిగా ఉంటుంది.
  • క్యారెట్‌తో ఏ కూర చేసినా, అది ఉడికే సమయంలో కాస్తంత పంచదార వేయండి. ఇదే పద్దతిని గ్రీన్ పీస్‌తో చేసే కూరలకు కూడా.
  • క్యారెట్ హల్వా తయారయ్యాక దానికి కొద్దిగా బియ్యపు పిండి కలపండి. కేరెట్ హల్వా మంచి రుచిగా ఉంటుంది.
  • కుక్కర్‌ లో పప్పు ఉడికించినప్పుడు ఒక్కోసారి పప్పులో నీరు ఎక్కువైపోతుంది. ఆ వేడి వేడి పప్పుతేరును చపాతి పిండిలో పోసి నానబెడితే పప్పులో ఉన్న పోషకవిలువలు వృధాకావు, చపాతీలు మృదువుగా వస్తాయి.
  • కూరగాయలు ఉడికించేటప్పుడు కొంచెం నిమ్మరసం చల్లితే రంగు మారకుండా ఉంటాయి. సూపుల్లో కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే మంచి రుచి వస్తుంది.
  • కూరలలో పసుపు ఎక్కువయితే కూర ఉంచిన పాత్రపై ఒక శుభ్రమైన బట్టను పరచినట్టుగా కడితే అధిక పసుపును అది పీల్చేసుకుంటుంది.


  • కూరల్లోగాని, పప్పులోగాని ఉప్పు ఎక్కువయినపుడు కాస్త నిమ్మరసం పిండాలి.
  • గోధుమలు పిండి పట్టించే ముందు శుభ్రంగా కడిగి ఎండబోసి పట్టిస్తే పిండి మెత్తగా ఉంటుంది. ఆ పిండితో చేసిన రొట్టెలు ఎంతో మృదువుగా ఉంటాయి.
  • గారెల పిండిలో, పులిసిన పెరుగు ఒక కప్పు, లేదా రెండు చెంచాల మైదా వేశారంటే గారెలు మృదువుగా, టేస్టీగా ఉంటాయి.
  • గులాబ్ జాం తాయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీరు కలపండి. అవి మృదువుగా రుచిగా ఉంటాయి.
  • గులాబ్ జాంలు చేసే సమయంలో కాసిని జీడిపప్పు కూడా గులాబ్ జాంలు చేసే ఉండలకు కలిపారంటే, అవి మృదువుగా ఉంటాయి. మంచి రుచిగా ఉంటాయి.
  • చింతపండు చెట్నీకి కాస్త బెల్లం, కాసిని టమోటాలు కల్పారంటే, చింతపండు చెట్నీ రుచే వేరుగా ఉంటుంది.
  • చపాతీ పిండిని పాలు లేదా గోరువెచ్చని నీళ్ళు లేదా కాస్త నూనె కలిపి గంటపాటు నానబెడితే చపాతీలు మృదువుగా వస్తాయి.
  • చపాతి పిండిలో ఉడికిన బంగాళదుంపను బాగా కలిపి, ఆ పిండితో చపాతీలు చేస్తే, చపాతీలు మృదువుగా ఎక్కువసేపు ఉంటాయి
  • చపాతీలు వత్తేటప్పుడు మధ్యలో కాస్త నూనెవేసి మడతలతో చేసి హాట్ ప్యాక్‌లో ఉంచితే ఆరేడుగంటలపాటు మెత్తగా ఉంటాయి.
  • టమోటా చారు పొయ్యిమీద నుంచి దింపేటప్పుడు కాస్త నిమ్మరసం పిండండి. అది మాంచి రుచిగా ఉంటుంది.


  • టమోటా సూప్ చేసేటప్పుడు క్యారెట్ వేస్తే పులుపు తగ్గటంతోపాటు పోషకవిలువలు వస్తాయి.
  • టమోటాలు ఉడికించేటప్పుడు ఒక టేబుల్ స్పూను పంచదార, ఉప్పు కలిపితే త్వరగా ఉడుకుతాయి.
  • దోసె పిండిలో ఒక చెంచా వెనిగర్ వేశారంటే, అట్టు చిల్లు చిల్లులుగా వస్తుంది. ముఖ్యంగా రవ్వట్టుకు ఇది చాల బాగుంటుంది.
  • నిమ్మరసం ఎక్కువగా రావాలంటే పది నిముషాలపాటు గోరు వెచ్చటి నీటిలో వేసి ఉంచాలి. ఒకవేళ ఫ్రిజ్ లో ఉంటే రసం తీయటానికి పది నిమిషాల ముందు బయటపెట్టాలి.
  • పరమాన్నం మరింత టేస్టీగా ఉండాలంటే, బియ్యాన్ని నెయ్యి వేసి కొంచెం సేపు వేయించి ఆ బియ్యంతో పరమాన్నం చేయాలి.
  • ప్రూట్ కేక్స్ పై ఒక టీ స్పూను గ్లిజరిన్ వేస్తే తాజాగా ఉంటాయి.
  • పులుసు, చారు మొదలైన వంటకాలలో పొరపాటున పులుపు ఎక్కువ పడవచ్చు. మజ్జిగ, పెరుగు మొదలైనవి విరివిగా పులిసి పోవచ్చు. అటువంటివాటిలో కొద్దిగా వంట సొడా కలిపితే మనకు కావలిసినంత రుచి తెచ్చుకోవచ్చు.
  • పూరీ పిండి కలిపేటప్పుడు సాధ్యమైనంత గట్టిగా కలుపుకుంటే పూరీలు నూనె పీల్చుకోవు.
  • పూరీలు బాగా క్రిస్పీగా ఉండాలంటే, పూరీ పిండికి బాగా మరిగించిన ఆయిల్ కలిపి , పూరీ పిండి తయారు చేసుకోండి.
  • ఫ్రైడ్ రైస్ చేసేప్పుడు నీళ్లు బదులుగా పాలు వాడితే అన్నం రుచిగా ఉంటుంది.


  • ఫ్రూట్ కేక్ తయారయ్యాక పొడి పొడిగా వుంటే ఒక టవల్ మడతపెట్టి కేక్ చల్లారే వరకు దానిమీద కప్పితే మెత్తగా అవుతుంది.
  • బంగాళదుంపల చిప్స్ కరకరలాడాలంటే పసుపు రంగులో కనిపించే దుంపలను ఎంపికచేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తోలు తీసి, చిప్స్ వేయించేందుకు అనువైన ముక్కలుగా చేయాలి. నీళ్ళలోంచి తీసి వాటిపై మొక్కజొన్న పొడిని చల్లి వేయించాలి.
  • బంగాళదుంప చిప్స్ మెత్తబడితే వాటిని నిముషం పాటు మైక్రోవేవ్ లో ఉంచితే కరకరలాడతాయి.
  • బెండకాయ వేపుతున్నప్పుడు జిగురొచ్చి కూర ముద్దలా అవుతుంది. బాండీలో ముక్కలు వేయగానే కాస్త మజ్జిగకూడా వేసి కలిపితే జిగురు రాదు.
  • బెండకాయలు కడిగిన తరువాత ఓ పది నిముషాలు తడి ఆరనిచ్చి ముక్కలు కోసినట్లైతే తీగలు సాగకుండా ఉంటుంది.
  • బాగా చల్లారిన పాలు తోడుకోవాలంటే మజ్జిగ చుక్కలతో పాటు చిన్న ఎండు మిరపకాయ వేస్తే సరి.
  • బజ్జీలకు శనగపిండి కలిపే సమయంలో ఆ పిండిలో కాస్త బియ్యపు పిండి కలపండి. కాస్త వేడి నూనే కూడా ఈ పిండికి కలిపి , ఈ పిండితో
  • బత్తాయి పండ్లని అయిదు నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచితే తొక్క కింద ఉండే తెల్లటి పొరని తేలిగ్గా వలిచేయవచ్చు.
  • మిగిలి పోయిన నిమ్మకాయ ఊరగాయను పప్పులో వేస్తే చాలా రుచిగా ఉంటుంది.
  • మిరపకాయ బజ్జీలు వేసి, వేడి వేడిగా తిని చూడండి. ఎంత రుచిగా ఉంటాయో?


  • మరుగుతున్న 'టీ' పొడిలో చిటికెడు శొంఠి పొడి, రెండు యాలుకలు వేసి, 'టీ'ఇస్తే చాలా రుచిగా ఉంటుంది.
  • లేత సొరకాయ తరిగినపుడు లోపల ఉండే మెత్తని గుజ్జును బాగా నానిన బియ్యానికి జోడించి మెత్తగా రుబ్బాలి. అందులో అల్లం, మిర్చి, ఉల్లిపాయముక్కలు, తగినంత ఉప్పు కలిపి దోసెలు పోస్తే రుచిగా ఉంటాయి.
  • వేపుడులో నూనె ఎక్కువైతే కాస్త శనగపిండి చల్లండి. తినడానికి రుచిగా ఉండటమే కాక ఎక్కువయిన నూనె తగ్గుతుంది కూడా.
  • వేరుశనగపప్పు వేయించాక బాగా రుచిగా ఉండాలంటే, బాగా వేడి నీటిలో వాటిని ఒక్క క్షణం ఉంచి తీసేసి, నీరంతా పోయే దాకా స్టెయినర్లో ఉంచి, ఆ తర్వాత వీటిని వేయించండి. చాల క్రిస్పీగా ఉంటాయి.
  • శనగపిండిలో పెరుగు కలిపితే పకోడీలు మెత్తగా వస్తాయి.
  • సాధారణ పెనంపై ఒక చెంచా ఉప్పును వేయించి ఆ తరువాత దానిపై దోశలు వేస్తే నాన్‌స్టిక్ పెనంపై వేసినట్టుగా అంటుకోకుండా వస్తాయి.
  • సలాడ్ కోసం పళ్ళు ముందుగానే కోసి పెట్టుకున్నా అవి నల్లగా మారకుండా ఉండాలంటే, వాటి మీద నిమ్మకాయ రసం పిండండి. రెండు పళ్లకు సగం నిమ్మకాయ రసం సరిపోతుంది.

No comments:

Post a Comment