Monday, May 19, 2014

మనస్సు - బుద్ది

మనిషికి దేవుడు ఇచ్చిన వరం బుద్ది. ఈ బుద్దికి అన్నీ తెలుసు. ఏది మంచి! ఏది చెడు! ఏ పని ఎలా చేస్తే బావుంటుంది! ఇలా ప్రతి ఒక్క విషయం మీద పూర్తి అవగాహన ఉంటుంది.

కాని మనస్సు బుద్ధి ని తప్పుదోవ పట్టిస్తుంది. మనస్సుకి ''మాయ'' ఆవరించి ఉంటుంది. గట్టి పట్టి కుర్చోబెడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రభావం ఎక్కువ అని చెప్పొచ్చు. చెప్పే చదువులో ''నీతి'' ''ధర్మం'' ఇలా ఏమి లేకుండా కేవలం అర్ధ సంపాదనే ద్యేయంగా కనపడుతుంది ప్రస్తుత విద్యావ్యవస్థ. దీనికి తోడు ప్రతిఒక్కరికి అశ్రద్ద ఎక్కువైంది. ఇంట్లో తల్లితండ్రులకి కూడా ఏమి తెలియదు. ఎందుకంటే వీరికి కూడా చెప్పేవారు లేరు. ఒకవేళ చెప్పినా వినరు. దీనితో సంప్రదాయాలు తుంగలో తొక్కేశారు. నీతి న్యాయం గాలికి వదిలేశారు. సమయానికి ఏది తోస్తే అదే మంచి. వీడికి ఏది ఆ సమయంలో ఉపయోగపడుతుందో అదే ధర్మం. ఇలా అయ్యింది న్యాయం, ధర్మం పరిస్థితి.

దీనివల్ల కలి పురుషుడు మనస్సుని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకొని మానవుడిని నానా తిప్పలు పెడుతున్నారు. ఈ విషయాన్నీ మాత్రం ఎవ్వరూ గమనించడంలేదు. ఇది ఎలా ఉంటుందంటే! ఎవరైనా ఏదైనా మంచి చెప్తే వాడిని పిచ్చోడిలా చూడటం, నువ్వు నాకు చెప్పేదేంటి? అనడం, వీడు చెప్తే తెలుసుకోవాలా? మాకు తెలిదా? అనే స్థితిలో నిలబెడుతుంది. ఉదాహరణకి నువ్వు ఒక పని చేస్తున్నావ్ అనుకో.

అది ఎలాంటి పనో ముందుగా బుద్ధి చెప్తుంది. ఇది చెడు పని చేయకు. ఇది మంచిపని మధ్యలో ఆపకు. అని.
కాని మాయ ప్రభావం ఇంకోలా ఉంటుంది. ఉదయాన్నే 5గంటలకి లేచి వ్యాయామం చేయాలి అనుకుంటుంది బుద్ది. కాని మాయ ఆ సమయానికి ఆ ఎం చేద్దాం కొంచంసేపు పడుకుని లేద్దాం లే అనిపిస్తుంది. ఒక వేళ దీని మాట వినకుండా నువ్వు చేసినా రెండు మూడు రోజులకి మించి చేయవు. మనస్సు నిన్ను మంచం మీద నుండి లెవనివ్వదు.

అలాగే పూజ చెయ్యాలని ఒకరోజు బుద్ది పుడుతుంది. కొన్నాళ్లు చేస్తాడు. ఒక వరం, లేకపోతె ఒక నెల క్రమం తప్పకుండ 5కి లేచి పూజ చేస్తారు. తరువాత మనసు మారిపోతుంది. ఒక గంట ఆలస్యంగా చేస్తారు. ఇంకొన్నాళ్ళకి ఇంకో గంట. ఇంకొన్నాళ్ళకి ఆ గంట పోయి వారంలో 3రోజులు అంటారు. ఇంకొన్నాళ్ళకి వారంలో ఒకసారి. ఇలా కొన్నాలు చేసిన తరువాత ఇన్ని పూజలు చేస్తున్నాను. ఇన్నాళ్ళ నుండి చేస్తున్నాను. కాని ఫలితం ఏముంది? ఏమి లేదు నేనెందుకు చేయాలి అని బలవంతం మీద చేస్తారు. ఇక లేనిపోని ఆలోచనలు చేసి పూజ చేయడం ఆపేస్తారు. ఈ ఒక్కటే కాదు మీ తలపెట్టిన ఎలాంటి పని అయినా ఇలా మధ్యలోనే ఆపుచేయిస్తుంది మనస్సు. ఎవరికో సాయం చేయాలని బయలుదేరారు అనుకుందాం! మధ్యలో మనస్సులో అనేక ఆలోచనలు పుట్టుకొస్తాయి. వీడికి చేస్తే నాకేంటి లాభం. ఈ డబ్బులతో సాయంత్రం చక్కగా బిర్యానీ తిని బీర్ తాగొచ్చు. లేదంటే ఇంకో అవసరానికి వాడుకోవచ్చు. లేదంటే వీడు నాకు ఒకప్పుడు ఏదో సాయం చేయమంటే చేయలేదు లాంటి ఆలోచనలు చేయించి మధ్యలో ఆపేస్తుంది.

ఇది ఎవరి తప్పు కాదు. మాయ ప్రభావం వల్ల మనస్సు ఇలా చేయిస్తుంది. కాని బుద్ది మాత్రం హెచ్చరిస్తూనే ఉంటుంది. కాకపోతే మనస్సు ముందు బుద్ది బలం నిలబడదు. ఈవిషయం గ్రహిస్తే బుద్దిని నిలబెట్టి మనస్సుని అదుపులో పెట్టొచ్చు.

ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకడు ఒకడిని చూపించి ఒరేయ్ వాడిని కొట్టు, లేదంటే తిట్టు అంటే వీడికి తెలుసు అనవసరంగా కొట్టకూడదు, తిట్టకూడదు అని సహజంగా తెలుస్తుంది. ఇదే బుద్ది. పిల్లలకి అన్ని మాటలు మనం ప్రతి అక్షరం చెప్పి, నేర్పించడం లేదు కదా! అలాగే ఏది మంచో, ఏది చెడో తెలుసుకోగలుగుతున్నాం అంటే అది బుద్ది వల్ల మాత్రమే. కాబట్టి మనస్సు చెప్పింది కాబట్టి చేశాను అనకుండా బుద్ది ఏమి చెపుతుందో తెలుసుకొని మసలుకోండి.

No comments:

Post a Comment