Wednesday, June 19, 2013

శీతాకాలంలో సమస్యలు - నిరోధించేందుకు చిట్కాలు

చలికాలం వచ్చేసింది. మొన్నటివరకూ అకాల వర్షాలు ముంచెత్తాయి.. వాతావరణంలో మార్పుల వల్ల దగ్గు, జలుబు, జ్వరం లాంటి అనారోగ్యాలు సంభవించే అవకాశాలు ఎక్కువవుతాయి. వీటి బారిన పడకుండ ఉండటానికి తీసుకోవలసిన చర్యలు..పాటించాల్సిన ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం.

సరిపడినంత నీరు తాగండి...
చలికాలంలో దాహంగా ఉండదనే కారణంతో మనలో చాలామంది నీరు తాగటాన్ని తగ్గించేస్తాము. కాని అలా చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మామూలుగా నీటిని మనం ఎలా తాగుతామో అలాగే ఈ కాలంలో కూడా శరీరానికి సరిపడినంత నీటిని తీసుకోవాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది. మనకు సంభవించే పలు రోగాలకు ప్రధాన కారణం జీర్ణక్రియ సరిగా లేకపోవడమే అని తెలుసుకోండి. దీన్ని గుర్తుంచుకుని రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని తాగండి.

వాతావరణ కాలుష్యం వల్ల ఈ కాలంలో అంటువ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. ఇంకా చెప్పాలంటే దోమల సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటి చుట్టు ప్రక్కల పరిసరాలలో నీరు నిలువకుండా చూడాలి. ఇన్ఫెక్షన్ కలుగకుండా చేతులను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

మామూలుగా ఎక్కువమందికి ఈ కాలంలో యాంటీబయాటిక్ ఇంజెక్షన్‌లు చేయించుకునే అలవాటు ఉంటుంది. కాని ఇది మరీ అంత మంచిపద్ధతి కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా మన శరీరంలో స్వతహాగా వ్యాధి నిరోధకశక్తిని పెంచుకునే ప్రయత్నం చేయమని వారు సూచిస్తున్నారు. ఈ కాలంలో వృద్ధి చెందే బ్యాక్టీరియాల కారణంగా మన శరీరంలోని హ్యుమిడిటీ పెరిగి శరీర ఉష్ణోగ్రత పెరగవచ్చు లేదా తగ్గవచ్చు వీటి వల్ల కామెర్లు, మలేరియా, టైఫాయిడ్, అతిసారం, దగ్గు, జలుబు, జ్వరం, ప్లూ వంటి అంటువ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి..

ఇలాంటి అంటువ్యాధుల నుండి మనల్ని మనం సంరక్షించుకోవడానకి పీచుపదార్థం ఎక్కువ ఉండే బార్లీ, గోధుమ, బియ్యం, ఉసిరి లాంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవడమే కాకుండా శరీరంలోని జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. ఆయుర్వేద వరప్రసాదాలైన అశ్వగంధ, కేసరి వంటివి శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచి శరీరంపై ఒత్తిడులను తగ్గిస్తాయి. తాజా పండ్లు, పచ్చటి కూరగాయలు, ఇనుము ఉన్న ఆకు కూరలను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం.

No comments:

Post a Comment